శ్రీశైలం : శ్రీశైలం మహా క్షేత్రంలో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు జరిగే సర్వ ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించేందుకు నూతనంగా రెండు సేవలను ప్రారంభిస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. సోమవారం సాయంత్రం పరిపాలనా భవనంలో జరిగిన సమావేశంలో ఉదయాస్తమాన సేవ, ప్రదోషకాల సేవల పోస్టర్ను విడుదల చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికుల అభ్యర్థన మేరకు దేవస్థానం ఈ సౌకర్యాన్ని కల్పించిందని చెప్పారు. రోజుకు 6 టిక్కెట్లు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సేవలలో పాల్గొనేందుకు www.srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
ఈ సేవలలో ఉదయాస్తమాన సేవకు రూ. 1,01,116, ప్రదోషకాల సేవకు రూ.25,116 రుసుమును నిర్ణయించారు. ఉదయాస్తమాన సేవా టికెట్టును పొందిన దంపతులు తెల్లవారుజాము సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే 14 విధాలా కైంకర్యాలలో స్వయంగా పాల్గొనే వీలుండగా, ప్రదోషకాల సేవలో పాల్గొనే సేవాకర్తలకు స్వామివారి గర్బాలయంలో పంచామృతాభిషేము, అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర కుంకుమార్చన, వేదాశీర్వచనము ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సేవాకర్తలకు వీఐపీ కాటేజీలలో బస ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.