శ్రీశైలం : శ్రీశైలం (Srisailam) పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపాలయాల వద్ద పచ్చదనం పెంపొందించటానికి అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆలయ ఈవో లవన్న (EO Lavanna) ఆదేశించారు. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా పూర్తయిన శ్రీశైలం ఆలయం పంచమఠాల పునర్నిర్మాణ పనులను ఆదివారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమానగోపు నిర్మాణాలు , ఘంటామఠ ప్రాంగణంలోని ఉపాలయాలు పూర్తి చేశామని, వీటి చుట్టూ పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. బిల్వం, కదంబం లాంటి దేవతా మొక్కలను నాటాలన్నారు. క్షేత్ర పరిధిలో ముఖ్యమైన కూడళ్ల వద్ద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఘంటా మఠంలోని కౌమారీదేవి , పాండవ గుహ వద్ద ఉన్న కాలభైరవస్వామి ( Kalabairava Temple) ఆలయ పునర్నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు.
టూరిస్టు బస్టాండ్ సమీపంలో భక్తుల వసతి కోసం నిర్మిస్తున్న గణేశ సదన్ (Ganesa sadan) నిర్మాణాన్ని పరిశీలించారు. గణేశ సదన్ వెనుక భాగాన అడవి జంతువులు రాకుండా కంచె ఏర్పాటు చేయాలని, భద్రతా సిబ్బంది నియమించాలని సూచించారు. ఆయన వెంట ఏఈలు రామకృష్ణ, మురళీధర్రెడ్డి తదితరులున్నారు.