Srirama Navami | మర్యాద పురుషుడు ఆ శ్రీరాముడు హిందువులకు ఆరాధ్యదైవం. రామ అని పిలిచినందతే కష్టాలు తొలగి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకేనేమో ‘రామాలయం లేని ఊరు ఉండదు.. రాముడిని ఆరాధించని భక్తుడు ఉండడు’ అని నానుడి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో ఎన్నో రామాలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు ఎంతో చరిత్ర ఉన్నది. ఇంతకీ ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం రండి..!
తెలంగాణలోని గోదావరి తీరాన శ్రీరాముడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరువు, మేనకల కుమారుడు భద్రుడి తపస్సుకి మెచ్చి ఇచ్చిన వరం మేరకు రాముడు సీతాలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి సమేతంగా వెలసినట్లుగా స్థలపురాణం. భద్రాచలానికి క్షేత్రానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉన్నది. భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తురాలు భక్తిశ్రద్ధలతో రామయ్యను కొలిచేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఓ రోజు శ్రీరాముడు కలలో కనిపించాడు. తాను గతంలో ఇచ్చిన వరం మేరకు.. భద్రగిరిపై కొలువుదీరి ఉన్నానని.. తనను తరించేలా ఏర్పాట్లు చేయమని, నీకు నా పరమభక్తుడు సాయంగా నిలుస్తాడని చెప్పాడు. దమ్మక్క భక్తులతో కలిసి వెళ్లి భద్రగిరి వద్దకు వెళ్లి శ్రీరాముడిని గుర్తించి పందిరి వేసి పండ్లు నైవేద్యంగా పెడుతూ వచ్చింది. ఆ తర్వాత కంచర్ల గోపన్న భద్రాచలంలో రాముడికి ప్రస్తుతం ఆలయాన్ని కట్టించాడు. ఏటా ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణం చూసి తీరాల్సిందే తప్ప.. మాటల్లో చెప్పలేం.
ఏపీలోని కడప జిల్లాలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నది. ఈ ఆలయంలో ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. ఎత్తయిన గోపురాలు, విశాలమైన ఆలయ రంగమంటపం, శిల్పకళా వైభవం దర్శించుకునేందుకు రెండు కళ్లు చాలవు. ఈ ఆలయానికి ఎంతో పురాతన ప్రాశస్త్యం ఉన్నది. జాంబవంతుడు కొండపై ఆశ్రమాన్ని నిర్మించాడు. ఉత్తరం వైపును కూర్చొని తారక మంత్రాన్ని జపిస్తూ తపస్పు చేశాడు. మరో గుట్టపై నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరం ప్రసాదించినట్లుగా స్థలపురాణం చెబుతున్నది. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ప్రాణ ప్రతిష్ట చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ఆంజనేయుడు కనిపించడు. ఇక్కడ రామయ్య కల్యాణం వెన్నెల వెలుగుల్లో జరుగుతుంది.
ఈ ఆలయం విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఉన్నది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నది. తొలి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ 469-496 ఏడీ మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేశారని, ఆ సమయంలోనే ఇక్కడ ఇచ్చ ఆలయం ఉండేదని స్థల పురాణం. కొన్నేళ్ల తర్వాత ఈ ఆలయ జాడ కనుమరుగైపోయిందని.. మళ్లీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి ఇక్కడి చెరువులో శ్రీరాముడితో సహా ఇతర దేవతా మూర్తులు విగ్రహాలు లభించాయి. ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు పెద్ద ఎత్తున ఆలయం నిర్మించి విగ్రహాలను ప్రతిష్టించారు. చెరువులో విగ్రహాలు దొరకడం వల్లే రామతీర్థం అనే పేరువచ్చిందని స్థానికులు చెబుతుంటారు. పూసపాటి వంశానికి చెందిన మహారాజు ఆలయం నిర్మించడమే కాకుండా భూములను ఇనామ్గా ఇచ్చారని.. వాటిపై వచ్చే ఆదాయంతోనే ఆలయంలో పూజాధికాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ శ్రీరామ నవమి ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉన్నది. దేవాలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవునా 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దానిపై సీతారాములతో పాటు పాండవులు సైతం సంచరించారని స్థానికులు చెబుతుంటారు. అలాగే ఇక్కడ జైనులు, బౌద్ధులు సైతం నివసరించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
కోదండ రామాలయం ఏపీలోని కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలోని గొల్లల మామిడాడలో ఉన్నది. 160 అడుగుల ఎత్తు గోపురం ఉంటుంది. ఇక్కడ వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన సూర్యదేవాలయాలు ఉన్నాయి. ఈ గ్రామంలోకి అడుగుపెడుతూనే ఎన్నో గోపురాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయాలు వందేళ్ల కిందట అప్పటి జమిందార్లు నిర్మించారని స్థానికులు పేర్కొంటారు. 1889లో ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులు భూమిని విరాళంగా ఇవ్వగా.. సీతారాముల విగ్రహాలను చెక్కతో చేయించి.. ఆలయాన్ని నిర్మించారు. 1939లో ఓ పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఆలయ తూర్పు, పడమర గోపురాలు వరుసగా 1948-50, 1956-58 సంవత్సరాల మధ్య నిర్మాణం జరిగింది. నవమి ఉత్సవాలకు ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. ఈ ఆలయాన్ని చిన్న భద్రాచలంగా పిలుచుకుంటారు. ఇక్కడ శ్రీరామ నవమిని ఘనంగా నిర్వహిస్తారు. సీతారాముల కల్యాణ వేడుకలు వైభవంగా జరుపుతారు. అలాగే, వైకుంఠ ఏకాదశి, విజయ దశమి ఉత్సవాలు సైతం ఘనంగా జరుగుతాయి.
డిచ్పల్లిలో రామాలయం ఉన్నది. నిజామాబాద్కి 27 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది. 14వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ రామ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయం శైలి, నిర్మాణంలో చాలా పోలికలు ఇంధూరు ఖజురహో అని పిలుస్తాయి. దీన్నే ఖిల్లా రామాలయం అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయం పైభాగాన, చుట్టూరా ఉన్న ప్యానెల్ అంతా కూడా వాత్సాయన కామసూత్రల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన శిల్పాలే కావడంతో అవి సహజంగానే ‘ఖజురహో’ను గుర్తుకు తెస్తాయి. ఆలయంపై ఉన్న శిల్పాలను స్థానికులు ‘గిచ్చు బొమ్మలు’గా పిలిచేవారని చెబుతారు. సంస్కృతంలో ‘గిచ్చు’ శృంగారానికి పర్యాయ పదం. అందుకే ఈ ఊరుని ‘గిచ్చుపల్లి’ పిలిచేవారని.. కాలక్రమేన అదే డిచ్పల్లిగా మారిందని చెబుతుంటారు. ఇక్కడ ఆలయంలో లోపల బయట గోడలపై ఉన్న కళారూపాలు కాకతీయుల వైభవాన్ని గుర్తుకు తెస్తుంది. శ్రీరామనవమి రోజున ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.
అమ్మపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయం హైదరాబాద్కు సమీపంలోని శంషాబాద్ మండలంలో ఉన్నది. 13వ శతాబ్దంలో వేంగీ చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మవారు కొలువై వున్న కారణంగానే ఈ ఊరికి ‘అమ్మపల్లి’ అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ ఆలయం 12వ శతాబ్దం నాటికి చెందిందని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయం దక్షిణ భారత సాంప్రదాయ నిర్మాణ శైలిలో నిర్మించగా.. రామాయణంలోని సన్నివేశాలను వర్ణించే శిల్పాలతో ఇక్కడ కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణలో 30 అడుగుల ఉత్తులో నిర్మించిన గోపురం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ ఆలయానికి రెండు నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిల్లోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని స్థానికులు చెబుతుంటారు. ఏటా ఇక్కడ శ్రీరామ నవమి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు మకరతోరణాలు ఉండడం ప్రత్యేకత. ముఖమంటపంలో ‘కూర్మం’ (తాబేలు) ఉండడం వల్ల ఈ క్షేత్ర దర్శనం చేతనే మోక్షం పొందుతారని ప్రతీతి. ఇక్కడి ఆలయంలో సినిమా షూటింగ్లు సైతం జరుగుతుంటాయి.
ఈ ఆలయంలో ఏపీలోని ప్రస్తుత అన్నమయ్య జిల్లా వాయల్పాడులో ఉన్నది. ఇక్కడ వాల్మీకి మహర్షి తపస్సు ఆచరించారని చెబుతుంటారు. ఇక్కడ పుట్టలో సీతారాముల విగ్రహాలు బయటపడ్డాయి. ఆ విగ్రహాలనే ఇక్కడ ప్రతిష్టించారని స్థానికులు చెబుతారు. ‘వల్మీకం’(పుట్ట) నుంచి రాముడు ఆవిర్భవించాడు కనకనే.. ఈ ప్రాంతాన్ని ‘వాల్మీకిపురం’ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బోయలు ఎక్కువగా నివసించడం వల్ల ‘బోయలపాడు’ అని పిలుస్తుండే వారు. కాలక్రమంలో ఈ రెండూ కలిసి వాల్మీకపాడుగా.. వాయల్పాడుగా ప్రసిద్ధి చెందింది. అన్నమయ్య కూడా ఇక్కడి సీతారాముడిని దర్శించుకొని.. తన కీర్తించినట్లుగా ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో విశాలమైన ప్రాంగణం.. ఎత్తయిన రాజగోపురం, పొడవైన ప్రాకారాలతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయ రాజగోపురాన్ని ఓ ఆంగ్లేయ అధికారి స్వామివారిపై భక్తితో నిర్మించడం విశేషం. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రంలో వాల్మీకి, రుక్మిణీ – సత్యభామ సమేత శ్రీ కృష్ణుడు, శ్రీదేవి – భూదేవి సమేత రంగనాథుడు, అనంతపద్మనాభ స్వామి వారలను దర్శించుకునే భాగ్యం కలుగుతుంది.