రవీంద్రభారతి, సెప్టెంబర్ 17: గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాల కేటాయింపులో సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూ హైదరాబాద్ రవీంద్రభారతిలో పలు కుల సంఘాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. అన్ని కులాలకు సమన్యాయం చేయాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ మద్యం దుకాణాల కేటాయింపు లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని ప్రకటించడం అభినందనీయమన్నారు. గౌడ కులస్థులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో ఆయా కులాలు ఆర్థిక పరిపుష్టి సంతరించుకుంటాయని, యువతకు ఉపాధి దొరుకుతుందని అభ్రిపాయపడ్డారు. ఈ నెల 22న హుజూరాబాద్లో నిర్వహించే గౌడగర్జనకు గౌడ కులస్థులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్లోనూ గౌడ కులస్థులకు ఎకరం భూమిలో కోటి రూపాలయతో ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించనున్నట్టు వెల్లడించారు. సమావేశంలో ఎమెల్సీ గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్, విద్యామౌలిక సదుపాయాల కల్పనశాఖ చైర్మన్ నాగేందర్గౌడ్, ఎస్సీ నాయకుడు చందు, జంబులయ్య, ఎస్టీ నాయకుడు కిషన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.