హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): మునుగోడులో ఓటమిని భరించలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని, బీసీ నేతలపై అక్రమ కేసులు, ఈడీ, ఐటీ పేరిట దాడులకు తెగబడుతున్నదని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ప్రధాని మోదీకి దమ్ముంటే బ్యాంకుల్లో రుణాల పేరిట కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్మోదీ, లలిత్మోదీ, విజయ్ మాల్యా వంటి మోసగాళ్లను స్వదేశానికి రప్పించాలని సవాల్ విసిరారు. గురువారం లండన్ నుంచి మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై అక్రమంగా ఈడీ, ఐటీ దాడులు చేయడాన్ని ఖండించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే గ్రానైట్ వ్యాపారంలో ఉన్న గంగుల కుటుంబంపై కేంద్రం కక్షకట్టి దాడులు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్న అనేకమంది ధనవంతులు ఉండగా, కేవలం బీసీ నేతలనే టార్గెట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. బీజేపీ మొదటి నుంచి బీసీ వ్యతిరేకంగానే ఉన్నదని చెప్పారు.
కోట్ల్లు కొల్లగొట్టినోళ్లు లండన్లో..
బ్యాంకుల నుంచి లక్షల కోట్లు తీసుకొని రుణాలు ఎగవేసిన లలిత్ మోదీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లండన్ వీధుల్లో దర్జాగా తిరుగుతున్నారని.. బీజేపీకి, మోదీకి చిత్తశుద్ధి ఉంటే ముందుగా ఈ ముగ్గురిని స్వదేశానికి రప్పించాలని మంత్రి సవాల్ విసిరారు. వీరితోపాటు అమీమోదీ, నీషల్ మోదీ, మోహుల్ స్కీ, జతిన్ మెహతా, చేతన్ జయంతిలాల్, నితిన్ జయంతిలాల్, ఆశిశ్జోబన్ పుత్ర, రితేశ్జైన్, సురేందర్సింగ్, హర్సాహీబ్ సింగ్, సభ్యసేత్, సంజయ్ బండారీ, నీలేశ్ పారిక్ సహా 72 మంది బడా వ్యాపారవేత్తలు లక్ష కోట్ల మేర బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారని సాక్షాత్తు విదేశీ మంత్రి త్వ శాఖ పార్లమెంటులో తెలియజేసిందని గుర్తుచేశారు.