హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు నేతృత్వంలోని కమిటీతో.. తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ నాయకులు శనివారం సమావేశమయ్యారు. సమావేశంలో శ్రీనివాస్గౌడ్తోపాటు మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ తదితరులు పాల్గొని కమిటీకి పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను జూలైలోగా పూర్తిచేసి, ఆగస్టు నుంచి అన్ని సంక్షేమ పథకాలు అమలుచేయాలని సూచించారు.
ఉద్యమకారులకు ఇండ్లు లేదా ప్లాట్లు కేటాయించడంతోపాటు నెలకు రూ.25 వేల పింఛన్ హామీని అమలుచేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు, తెలంగాణ సాయుధ పోరాటయోధులకు కల్పిస్తున్న తరహాలోనే మలిదశ తెలంగాణ ఉద్యమకారులకు కూడా అన్నిరకాల సంక్షేమ ప్రయోజనాలు అందించాలి. సకల జనుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యోగుల సేవలను గుర్తించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొంతమంది అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చాం.. మిగిలిన అర్హుల కుటుంబాలకు కూడా తక్షణమే ఉద్యోగావకాశాలు కల్పించాలి. ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేసి.. ఉచిత బస్సుపాస్తోపాటు ఉచిత వైద్యం కల్పించాలి. జార్ఖండ్లో ఉద్యమకారుల కోసం అమలుచేస్తున్న విధానాన్ని ఇకడా అమలుచేయాలి’ అని కోరారు.