టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. ఇవాళ శ్రీలంక డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ డి వెంకటేశ్వరన్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్లోని ప్రశాసన్ నగర్ పార్క్లో వెంకటేశ్వరన్ మొక్కలు నాటారు.
అనంతరం వెంకటేశ్వరన్ మాట్లాడుతూ.. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టేందుకు, పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. సమాజం కోసం నేను అనే మహోన్నత ఆశయంతో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అన్నారు. ప్రకృతి సమతుల్యతకు, భవిష్యత్ తరాల మనుగడకు మొక్కలు నాటడం మినహా మరే ప్రత్యామ్నాయం లేదన్న విషయాన్ని గ్రహించి ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకున్న సంతోష్ను తాను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అని వెంకటేశ్వరన్ పేర్కొన్నారు. జోగినపల్లి సంతోష్ కుమార్ను శ్రీలంకకు ఆహ్వానించి, ప్రధాని మహీంద్ర రాజపక్సేతో కలిసి గ్రీన్ ఇండియా చాలెంజ్ను నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి రాఘవ తదితరులు పాల్గొన్నారు.