న్యూఢిల్లీ, మార్చి 14: కార్ల ధరలకు మళ్లీ రెక్కలురాబోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ కరెన్సీ విలువ పాతాళంలోకి పడిపోయింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు తమ వాహన ధరలను పెంచడానికి మరోసారి సిద్ధమవుతున్నాయి. డాలర్, యూరోతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనం చెందడంతోపాటు ఉత్పత్తి వ్యయం అధికం కావడం వల్లనే వాహన ధరలు పెంచాల్సి వస్తున్నదని ఆటోమొబైల్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. వీటికి తోడు దేశవ్యాప్తంగా వంటగ్యాస్ కొరత కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నదని, ఈ ఇబ్బందికర పరిస్థితులు ఆటోమొబైల్ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. సామాన్యుడికి ఊరట కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం తక్కువ సీసీ సామర్థ్యం కలిగిన కార్లపై జీఎస్టీని తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంతో వాహన సంస్థలు ధరలను భారీగా తగ్గించాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు పదిహేను రోజుల్లో క్రూడాయిల్ ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. దీంతో క్రూడాయిల్తో ఉత్పత్తి అయ్యే ఇంజిన్ ఆయిల్ కోసం అధికంగా వెచ్చించాల్సి రానుండటం కూడా ధరలు పెరగడానికి మరో కారణం. గత నెల చివర్లో 73 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ధర ప్రస్తుతం 103 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది. సుమారుగా 30 డాలర్లు మేర పెరిగింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ ముదురుతుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఆందోళన నెలకొన్నది. సమీప భవిష్యత్తులో బ్యారెల్ ధర 200 డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని అంచనాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చమురు దిగుమతులపై ఆధారపడుతున్న భారత్ లాంటి దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడనున్నదని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడంతో వాహన ధరలను 2 శాతం పెంచుతున్నట్టు మెర్సిడెజ్-బెంజ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) బ్రెండన్ సిస్సింగ్ తెలిపారు. యూరోతో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోవడంతోపాటు ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో సంస్థపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా వాహన ధరలను స్వల్పంగా పెంచినట్టు చెప్పారు. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ మరోసారి వాహన ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా వాహన ధరలను 2 శాతం వరకు సవరిస్తున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనుకావడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థ రూ.43.23 లక్షల నుంచి రూ.2.34 కోట్ల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది.