హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలంతా ఒకటేనని, మనకు జాతి, కుల, మత బేధాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్రం గత ఏడున్నరేండ్లలో అద్భుతాలు ఆవిష్కరించిందని తెలిపారు. అద్భుత, అపురూప ఆర్థిక సౌష్టవంతో, సర్వమత సామరస్యంతో పురోగమిస్తున్నదని చెప్పారు. ఇక దేశమంతా ఏ విషయమైనా తెలంగాణ నుంచే నేర్చుకొంటుందని పేర్కొన్నారు. ప్రగతిభవన్లో శనివారం జరిగిన ఉగాది వేడుకల్లో కేసీఆర్ ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
నా తెలంగాణ.. అద్భుతాలకు నెలవు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక మహోన్నత ఘట్టం. అపోహలు, అనుమానాలు, అసహాయతలు, నిస్సహాయత. చర్చలు, వాదోపవాదాల మధ్య జరిగిన 15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించింది. ప్రజాశీర్వాదం, భగవంతుడి ఆశీస్సులతో రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశాన్ని ప్రజలు కలిగించారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యం వ్యక్తిగతంగా నాకు చాలా సంతృప్తిగా ఉన్నది. ఎందుకంటే ప్రతి సందర్భంలో నేను చెప్పే ఒకే ఒక మాట ‘మనకు జాతి లేదు, కులం లేదు, మతం లేదు. తెలంగాణ జాతి అంతా ఒక్కటే’. ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకొన్నాం. రాష్ట్ర ప్రస్థానం మొదలైనప్పుడు అనేక మందికి అనేక సందేహాలు ఉండేవి.
కరెంట్ బాగైతదా? చిమ్మ చీకట్లు తొలుగుతయా? మంచినీళ్ల సమస్య తొలిగిపోతదా? సాగు నీళ్లు వస్తయా? తొందరగా వస్తయా? ఇంత తొందరగా సాధ్యమైతదా? వంటి అనేక ప్రశ్నలు, అనుమానాలు కలిగాయి. వీటన్నింటినీ అదిగమిస్తూ భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల సహకారంతో స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం చేయనన్ని నూతన ఆవిష్కరణలు, ఏ రాష్ట్రం సాధించనన్ని అద్భుత ఫలితాలు సాధించింది నా తెలంగాణ రాష్ట్రం. అనేక విషయాల్లో అనేక అద్భుతాలు జరిగాయి. అధికారుల పనితీరుతో చాలా సాధించాం. ఈ అధికారులను ఎక్కడో అమెరికా నుంచి తీసుకురాలేదు. వాళ్లు స్వర్గం నుంచి రాలేదు. అదే అధికారులు, అదే పద్ధతి. రిజర్వ్బ్యాంక్ మన రెవెన్యూ రాబడి ఎంత తేల్చిందని అధికారులను ఆరా తీస్తే.. మనం 23 జిల్లాల సమైఖ్య రాష్ర్టాన్ని ఎప్పుడో మించి పోయాం సార్ అని మన అధికారులు చెప్పారు. గత ఏడాది మన రాష్ట్ర ఆదాయం 1,77,630 కోట్లు అని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. ఇది నిజంగా అద్భుతం. అనేక దశాబ్దాల నుంచి అతిపెద్ద రాష్ర్టాలుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్కన్నా తెలంగాణ ముందు వరుసలో పరుగెడుతున్నది. విద్య, విద్యుత్తు, విద్యుత్తు, తలసరి ఆదాయం.. ఇలా చెప్తూ పోతే చాంతాండంత లిస్టు ఉన్నది.
దళిత బిడ్డలకు నాడు మాటిచ్చా
భేదభావాలు సృష్టించేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నాలు చేసినా మెజారిటీ ప్రజలు ఏకోన్ముఖంగా పనిచేసి సాధించిన ఫలితమే ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తున్న అభ్యుదయం. కుల మత జాతి వివక్ష లేకుండా అద్భుతాలు ఆవిష్కరించాలంటే కొన్ని పనులు జరగాలి. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న, తరతరాల వివక్షకు గురైన దళిత బిడ్డలు నన్ను ఒక్కటే కోరారు. నేను ప్రాజెక్టులు, విద్యుత్తు, మిషన్ కాకతీయ గురించి చెప్తుంటే.. ‘సార్ వాటిల్లో మాకు వచ్చే లాభం తక్కువ. మా గురించి ఆలోచించండి సార్’ అని కోరారు. నేను వాళ్లను కూర్చొబెట్టుకొని ‘మీరు అడిగేది వందశాతం కరెక్ట్.. కొద్దిగా ఓపిక పట్టండి. దాని అద్భుత ఫలితం మీకు వస్తదని చెప్పిన. ఈ సమాజంలో ఎక్కడి నుంచి ప్రారంభమైతే ఎక్కడికి పోతమనే మాట నేను చేసి చూపిస్తా. నా మీద విశ్వాసం ఉంచండి’ అని చెప్పిన. జర్నలిస్టు మిత్రుడు అల్లం నారాయణ గతంలో పత్రికలో ప్రాణహిత అనే కాలం రాసేవారు. తెలంగాణ బాధలు, కష్టాలు, ఇక్కడ జరిగిన దోపిడీ, నలిగిపోయిన ప్రజానీకం, అన్నార్తుల బాధలను అందులో ప్రస్తావించేవారు. ఈ రోజు అవన్నీ మృగ్యమైపోతున్నాయి. అందర్నీ సమానంగా చూసే అద్భుత ఆవిష్కారం జరిగింది.
రాష్ట్రం వచ్చిన తొలి నాళ్లలో నా తెలంగాణ దళిత బిడ్డలకు ఏ విషయం చెప్పానో.. దానికి అనుగుణంగా మేధోమథనం చేసి తెచ్చిన పథకమే దళితబంధు. ఈ పథకం చాలా అద్భుతాలను సృష్టించబోతున్నది. దళితజాతి రత్నాలు, వజ్రాలు వారి ప్రతిభను ప్రపంచానికి చాటబోతున్నారు. భారతదేశంలో మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో వారికి ఈ అవకాశం లభించింది. సర్వులను నేను కోరేది ఒక్కటే.. దళిత బిడ్డల వైభవం, అభివృద్ధి కోసం తోచిన సలహా ఇవ్వండి, సహాయం చేయండి, వారిని ఉత్తేజపరచండి. ఈ దేశానికే తెలంగాణ మార్గనిర్దేశం చేయబోతున్నదని ఈ పర్వదినాన నా మనసులో సంకల్పం చేస్తున్నాను. ఇదొక మహాయజ్ఞం. దేశంలో మరెక్కడా జరగని యజ్ఞం. దేశంలో ఎవరూ చేయలేని సాహసాన్ని మనం చేశాం. దీన్ని హృదయపూర్వకంగా చేశామే తప్ప ఎన్నికల కోసమో, ఓట్ల కోసమో, రాజకీయ స్టంట్ల కోసమో చేసింది కాదు. తెలంగాణ ఆ విధంగా చేయదు. తెలంగాణకు ఆ క్యారెక్టర్ లేదు. సహృదయంతో చేసిన ఈ పనిని సమాదరించి, సమోన్నతంగా నిలపాల్సిన బాధ్యత యావత్ సమాజం స్వీకరించాలి.
ఢిల్లీ, ముంబై నుంచి వచ్చి విల్లాలు కొంటున్నరు
గతంలో నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక శాసనసభా సంఘం సభ్యుడిగా ముంబై వెళ్లాను. అక్కడ మాకు ఆ నగరాన్ని చూపించేందుకు ఓ మహిళా గైడ్ వచ్చారు. ఎక్కడ ఉంటరు.. ఏం చేస్తరు అని అడిగితే బాంద్రాలో ఉంటామని చెప్పారు. మీ ఇల్లు ధర ఎంత ఉంటదని అడిగితే రూ.3 కోట్లు ఉంటదని చెప్పింది. ఆ రోజుల్లోనే అంత ధర. అప్పుడు రూ.30 లక్షలకే మన జూబ్లీహిల్స్లో బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకునే పరిస్థితి ఉండేది. అప్పుడు నేను ఆ అమ్మాయికి చెప్పిన.. ఆ ఇల్లు అమ్ముకొని మా హైదరాబాద్ రా ఇక్కడ మంచి ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవచ్చు. మిగిలిన డబ్బులు బ్యాంక్లో వేసుకొంటే హ్యాపీగా మహారాణిలా బతుకొచ్చు అని. ఆమె రాను సర్ అన్నది.
ఎందుకని అడిగితే ‘మీ దగ్గర కరెంటు ఉండదు, మంచి నీళ్లు రావు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి’ అని చెప్పింది. వ్యక్తుల పర్సెప్షన్ ఎలా డెవలప్ అవుతదో అదే ప్రివేల్ అవుతుంటది. ఈ రోజు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్లో రూ.25 కోట్లతో విల్లాలు బుక్ చేసుకొంటున్నరు. అంటే తెలంగాణలో భూముల ధరల్లో గానీ, సామాజిక ఉత్తేజంలో గానీ సంతృప్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి. దేశంలో ఏ మూలనైనా సరే తెలంగాణ నుంచే నేర్చుకోవాలనే స్థాయికి ఎదుగుతాం. మిషన్ భగీరథ తెలంగాణ నుంచే నేర్చుకోవాలి, కాళేశ్వరం ప్రాజెక్టులో ఇంజినీర్ల కృషి తెలంగాణ నుంచే నేర్చుకోవాలి. ఇలా అనేక విజయాలను ఇక్కడ సాధించాం. ఏ విషయంలోనైనా అద్భుతాలు సృష్టిస్తాం. దేశానికి మార్గనిర్దేశం చేయబోతున్నాం.
ఆధ్యాత్మిక రంగంలోనూ తీసిపోలేదు
యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించుకొన్నాం. ఆధ్యాత్మిక రంగంలోనూ తెలంగాణ ఎక్కడా తీసిపోదు. గొప్ప సంస్కారం ఉన్న నాయకుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆయన ధర్మపత్ని కలిసి మనందరి పక్షాన అన్ని దేవాలయాల్లో క్రమం తప్పకుండా పూజలు ఆచరిస్తూ తిరుగుతూ మనందరికీ ఆశీస్సులు సంపాదిస్తున్నారు. వారు అదేవిధంగా ఆశీస్సులు సంపాదించాలి. మనం ముందుకు పురోగమించాలి.
అందరికీ మంచి జరగాలి
ఈ శుభకృత్ నామ సంవత్సరంలోనూ ఇప్పటి వరకు ఏ పద్ధతుల్లో సర్వజనుల సంక్షేమం కోసం పరితపిస్తున్నామో అదే మార్గంలో మమ్మల్ని నడిపించాలని, అందరి అభ్యుదయం ప్రతి ఒక్కరి అభిమతం కావాలని ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరంలో సర్వజనులకు సుఖము, శాంతి, ఐశ్వర్యం, అదృష్టం కలగాలని నిండు మనుసుతో ప్రార్థిస్తున్నాను. సంతోష్కుమార్ శాస్త్రి ఎంతో శ్రావ్యంగా, సుమధురంగా మంచి మాటలు చెప్పారు. పంచాంగంలో ఏమున్నదో కానీ.. ఆయన గొంతులో మాత్రం చాలా శుభం పలికారు. మాస్కుల మాట లేదు ఆర్టీపీసీఆర్ ప్రస్తావన లేదు అని సీఎం కేసీఆర్ చమత్కరించారు.
అన్ని వ్యవస్థలు కలిస్తేనే అద్భుతాలు
తెలంగాణలో ఈ రోజు ఏ మారుమూల ప్రాంతానికి పోయినా భూముల విలువ రూ. 25-30 లక్షలకు తక్కువ లేదు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అయితే బాన్సువాడలో రూ.50 లక్షలకు తక్కువ మాటే లేదని చెప్తున్నరు. బాన్సువాడ పట్టణం దగ్గరైతే రూ.2-3 కోట్లకు తక్కువ లేదన్నరు. అంజయ్య యాదవ్ను అడిగితే మా దగ్గర రూ.2-3 కోట్ల్లు సార్.. రూ.కోటి లోపల ముచ్చటే లేదు అంటున్నరు. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఈ సంపద ఏ విధంగా సృష్టించబడింది. ఏ ఒక్క పనితోనో, ఏ ఒక్క కార్యక్రమంతోనో, ఏ ఒక్క వ్యవస్థ సమాహారంగానో ఈ అద్భుత ఫలితం ఆవిష్కృతం కాదు. అనేక వ్యవస్థలు కలవాలి. అనేక విషయాలు ఒకే వద్దకు రావాలి.
మన వనరులు, మన ఉద్యోగాలు మనకే
రాష్ట్రంలేని రోజున రూ.10 వేల కోట్లకు కూడా నోచుకోని తెలంగాణ, ఈ రోజు తన డబ్బును తనకు, తన ఉద్యోగాలు తనకు వినియోగిస్తున్నది. తెలంగాణలో ఇప్పుడు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసుకొన్నాం. అటెండర్ నుంచి ఆర్డీవో వరకు మన వసతులు, మన వనరులు, మన అవకాశాలు, మన ఉద్యోగాలు మనకే లభిస్తాయి. మనందరి స్వప్నం బంగారు తెలంగాణ. ఆ స్వప్నం నిజం కావాలని మనసా వాచా కర్మణా కోరుకొంటున్నాను. పాలకులు న్యాయమార్గంలో, ధర్మమార్గంలో పరిపాలన చేస్తే, ప్రజలందరికీ అనురక్తులై పరిపాలన చేస్తే, అందర్నీ సమాదరిస్తే లోకమంతా సుఖంగా ఉంటుందని పెద్దలు చెప్పారు. ఆ పరంపరతో ముందుకు సాగుతున్నాం. నేను ఈ రోజు గర్వంగా కాలర్ ఎగిరేసి చెప్పగలను.. దేశంలో అద్భుత సత్కారాలు, సౌకర్యాలు పొందుతున్న బ్రాహ్మణులు ఎక్కడ ఉన్నారంటే.. నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. దేశానికే తలమానికంగా ఉండే బ్రాహ్మణ సదనం ఎక్కడ నిర్మించారంటే హైదరాబాద్ బంజారాహిల్స్లో నిర్మించినం. దీన్ని త్వరలోనే ఆవిష్కరించనున్నాం. కుల, మత, జాతి వివక్ష లేకుండా అందర్నీ సమోన్నతంగా, సహృదయంతో వారివారి మంచి చెడులను గమనించి సత్కరించే సంస్కారాన్ని, స్వభావాన్ని తెలంగాణకు ప్రసాదించిన దేవదేవునికి కృతజ్ఞతలు.