854 ఫీట్లు మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదు
ఏపీ వాదనలను ఖండించిన తెలంగాణ సర్కారు
చెన్నై తాగునీటి సరఫరాపై కేఆర్ఎంబీ సమావేశం
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): చెన్నై తాగునీటి సరఫరా కోసం శ్రీశైలం రిజర్వాయర్ మినిమల్ డ్రాడౌన్ లెవల్ (ఎండీడీఎల్)ను ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే మెయింటెయిన్ చేయాలని, ఏపీ ప్రతిపాదించినట్టుగా 854 ఫీట్లుగా మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది. అలా మెయింటెయిన్ చేయాలని ఒప్పందంలో ఎక్కడా లేదంటూ ఏపీ వాదనలను తెలంగాణ తీవ్రంగా ఖండించింది. 2022-23 నీటిసంవత్సరానికి చెన్నై నగరానికి శ్రీశైలం నుంచి సరఫరా చేయాల్సిన తాగునీటి యాక్షన్ ప్లాన్పై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శుక్రవారం సమావేశమైంది. కేఆర్ఎంబీ చైర్మన్ ఆధ్వర్యంలో వర్చువల్గా కొనసాగిన ఈ సమావేశంలో తొలుత ఈ ఏడాది చెన్నై నగరానికి సరఫరా చేయాల్సిన తాగునీటి అంశంపై చర్చించారు.
పూండి రిజర్వాయర్ వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్న దృష్ట్యా జూలై, ఆగస్టు నెలల్లో తమకు తాగునీటిని విడుదల చేయవద్దని, సెప్టెంబర్ నుంచి విడుదల చేయాలని తమిళనాడు అధికారులు విజ్ఞప్తి చేశారు. దీనిపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ వర్షాలు సమృద్ధిగా కురిసిన సమయంలోనే నీటిని విడుదల చేస్తామని, కండలేరు రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. అనంతరం బనకచర్ల క్రాస్రెగ్యులేటరీ వద్ద అన్ని ఔట్లెట్లతో పాటు, వెలిగోడు రిజర్వాయర్ వద్ద కూడా రియల్టైమ్ డాటా అక్విజషన్ సెన్సర్లను ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబీకి తెలంగాణ మరోసారి సూచించింది. ఈ సమావేశంలో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్పురే, తెలంగాణ రాష్ట్ర అంతర్రాష్ట్ర జలమండలి చీఫ్ ఇంజినీర్ మోహన్రావు, సూపరింటెండెంట్ ఇంజినీర్ కోటేశ్వర్రావు, ఈఈ సల్లా విజయ్కుమార్, ఏపీ, తమిళనాడు రాష్ర్టాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.