సిద్దిపేట : ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. డాక్టర్ల ఉత్పత్తిలో కూడా రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని చిన్నకోడూరు మండలం రామంచలో నూతనంగా నిర్మించిన శ్రీరంగనాయక స్వామి బీఫార్మసీ కళాశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..8 నెలల్లో అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయం అన్నారు.
విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట. మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇలా అన్ని రకాల విద్యలు సిద్దిపేటలో అందుబాటులో ఉన్నాయి. సిద్దిపేట ఒకటే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని చెప్పారు.
అదేవిధంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ, ఐటీ అని మాత్రమే అనేవారు. అదే ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో ఐటీతో పాటు గ్రామాల్లో వ్యవసాయం కూడా ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ నంబర్వన్గా ఉంది. తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు ఉంటే ఈరోజు 10 లక్షల ఐటీ ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారిందని గుర్తు చేశారు.
దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలం గాణ రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పోటీ పడుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం తిట్టడంలో పోటీ పడుతున్నాయని మండిపడ్డారు.
ఇదే స్ఫూర్తితో ముందుకు పోతామన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తాం. హైదరాబాద్లో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇప్పటినుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించాం. ఎగ్జిబిషన్ సొసైటీ మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసిందని పేర్కొన్నారు. మంత్రి సబిత మాట్లాడుతూ.. బీఫార్మసీ కాలేజీ అన్ని అనుమతులు పొంది ఈరోజు ప్రారంభించుకోవడం అంటే దాని వెనుక మంత్రి హరీశ్ రావు కృషి ఎంతో ఉందన్నారు.
దేశమంతా అభివృద్ధిలో తెలంగాణనే మోడల్ అని చెప్తుంటే తెలంగాణకే సిద్దిపేట మోడల్గా నిలిచిందని ప్రశంసించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.