భక్తుల జయజయధ్వానాల మధ్య వేడుక
ఖమ్మం, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది. ఆదివారం కల్యాణ మహోత్సవం జరిగినచోటే సోమవారం కన్నుల పండువగా శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేకం జరిగింది. తొలుత అర్చకులు పల్లకీలో ఉత్సవమూర్తిని స్టేడియానికి తీసుకొచ్చారు. యాగశాలలో అర్చకులు చతుఃస్థానార్చన, విశ్వక్సేన హోమం చేపట్టారు.
పంచ నదుల తీర్థ జలాలతో సంప్రోక్షణ చేసి, ఆ తీర్థాన్ని అష్టదిక్కుల్లో చల్లారు. పట్టాభిషేక ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. రాముడి పాలన నేటి తరాలకు ఆదర్శం కావాలని చెప్పారు. స్వామివారికి బంగారు పాదుకలు, ఛత్రం, ముద్రిక, రాజదండం, కిరీట ధారణ గావించారు. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఆలయ ఈవో బానోతు శివాజీ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించినట్టు గవర్నర్ తెలిపారు.