హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): శ్రీలంకలోని అనూరాధపురం మహా విహార ప్రధాన భిక్షువు జ్ఞానతిలకథెరొతో బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రత్యేకతలను వివరించి, ఆహ్వానించగా.. త్వరలోనే సందర్శిస్తానని తెలిపారు. మౌఖిక సాహిత్యంగా ఉన్న బుద్ధ వచనాన్ని తొలిసారిగా తాళపత్రాలపై లిఖించిన అనురాధాపురంలో ఉన్న మాతలె బౌద్ధగుహలను లక్ష్మయ్య సందర్శించారు. అశోక సామ్రాట్ సమకాలికుడైన శ్రీలంక రాజు దేవానాంపియ తిస్స ఆధ్వర్యంలో వీటిని తాళపత్రాలపై లిఖించారు. బుద్ధ వచనాన్ని (త్రిపీఠకాలను) బహ్మీ లిపిలో అక్షరబద్ధం చేసిన ఘనతను శ్రీలంక దకించుకున్నదని, ఆ తర్వాతే సూత్ర, వినయ, అభిదమ్మ పీఠకాలు మన దేశంలో అందుబాటులోకి వచ్చాయని లక్ష్మయ్య తెలిపారు.
తెలుగు నేలకు చెంది, శ్రీలంక బౌద్ధ సంఘ నాయకునిగా ఎన్నికైన క్రీ.శ. 5వ శతాబ్దానికి చెందిన ఆచార్య బుద్ధఘోషుడు కూడా మాతలే బౌద్ధ గుహలో కొంతకాలం నివసించినట్టు ఆయన చెప్పారు. ఆయన విశుద్ధిమగ్గ అన్న బౌద్ధగ్రంథాన్ని రాసినట్టు పేర్కొన్నారు. ఆచార్య బుద్ధఘోషుని పేర ఇకడ ఒక పాఠశాలను శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ నిర్వహిస్తున్నదని చెప్పారు. బుద్ధవనం ప్రాజెక్టు బుద్ధిస్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి క్రీ.పూ. 3వ శతాబ్దినాటి మాతలే గుహలను తొలచిన తీరును, అకడ లభించిన పురావస్తువులను పరిశీలించారు. కార్యక్రమంలో శ్రీలంక సెంట్రల్ కల్చరల్ ఫండ్, డైరెక్టర్ జనరల్ ఆచార్య గామిని రణసింఘే, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.