హైదరాబాద్/నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, జనవరి 2 : వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. సోమవారం తెల్లవారుజామునుంచి రాత్రి వరకు భక్తులు ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకొని తరించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం, పాతగుట్ట క్షేత్రంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయ పునఃప్రారంభం అనంతరం దేవస్థాన చరిత్రలో తొలిసారిగా ప్రధానాలయంలోని ఉత్తర ద్వారం గుండా ఉదయం 6:48 గంటలకు స్వామివారు వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనమిచ్చారు.
దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తదితరులు స్వామివారిని దర్శించుకొన్నారు. ధర్మపురిలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వామివారిని దర్శించుకున్నారు. వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, అలంపూర్ క్షేత్రంలోని జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకొన్నారు. కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్ది తిరుమలలో ఉత్తర ద్వారం గుండా శ్రీవారి దర్శనం చేసుకొన్నారు.
రెండు కిలోల కిరీటం
సిద్దిపేటలోని మొయిన్పురా వేంకటేశ్వర స్వా మి ఆలయంలో సోమవారం ఉదయం 5 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నారు. స్వామి వారికి రెం డు కిలోల బంగారు కిరీటాన్ని సమర్పించారు.