బాసర, ఫిబ్రవరి 5: వసంత పంచమి సందర్భంగా శనివారం బాసరలోని సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి-విజయలక్ష్మి దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్లతో కలిసి ఆలయానికి చేరుకొన్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాసర అభివృద్ధికి రూ.8 కోట్లతో అతిథిగృహాలు నిర్మించినట్టు తెలిపారు. మరో రూ.50 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, త్వరలోనే టెండర్లు పిలువనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకురావాలని నిర్ణయించిందని, దీన్ని బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం నుంచే ప్రారంభించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.