సూర్యాపేట : భారత క్రీడా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మేజర్ ధ్యాన్ చంద్ దే అని మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) పేర్కొన్నారు. సూర్యాపేటలోని ఎస్వీ డిగ్రీ కళాశాల ఆడిటోరయంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రికి ఎన్.సి.సి విద్యార్థులు మార్చ్ పాస్ట్ తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి..ధ్యాన్ చంద్ క్రీడాస్ఫూర్తి నేటి యువతకు ఆదర్శం అన్నారు.
మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడకే వన్నెతెచ్చారన్నారు. క్రీడలంటే కేవలం ఆటలేకాదు, జీవితానికి అను సంధానమైనటువంటి గెలుపు, ఓటమి, ధైర్యసాహసాలకు ప్రతీకలనీ, దీని ద్వారా మానసికోల్లాసం కలుగుతుందని తెలిపారు. ప్రతి రోజు 30 నిమిషాలు క్రీడలు ఆడి, శారీరక దృఢత్వాన్ని పొందాలని పిలుపు నిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడా రంగానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చమన్నారు. ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు.
సమాజ లో జరుగుతున్న అనేక అనర్థాలకు కారణం సెల్ ఫోన్ లు, వ్యాయామం లేకపోవడమే అన్నారు. రాబోయే రోజుల్లో క్రీడా హబ్గా సూర్యాపేట జిల్లాను నిలిపేందుకు యువత కృషి చేయాలని కోరారు. సెల్ ఫోన్ వద్దన్న మంత్రి క్రీడలే ముద్దు అన్నారు. వచ్చే ఏడాది నుంచే సూర్యాపేటలో స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించ నునట్లు తెలిపారు. యువతను క్రీడా రంగం పై ఆసక్తి పెంచేలా వారికి త్వరలోనే ప్రభుత్వం తరపున క్రీడా సామగ్రి ని అందిచనున్నట్లు తెలిపారు.
అనంతరం జాతీయత స్థాయిలో ప్రతిభ కనబర్చిన జిల్లాకు చెందిన క్రీడాకారులు రవీందర్ రెడ్డి, మల్లికాంబ, వెంకట్ రెడ్డి, మహ్మద్, కోటేశ్వర రావు, వంశీ, కళ్యాణ్ , వీరన్న, సమతకు ప్రశంసా పత్రాలు, ట్రోపీలు అందజేసి అభినందించారు. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, క్రీడాదికారి వెంకట్ రెడ్డి, మారిపెద్ది శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.