ఖలీల్వాడి, ఫిబ్రవరి 24: తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. టీఎన్జీవోస్ 34వ జిల్లాస్థాయి అంతర శాఖల క్రీడలను శుక్రవారం నిజామాబాద్ ఐడీవోసీ కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఇతర రాష్ర్టాల్లో ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని, తెలంగాణ ఉద్యోగులు జీతాలు, పదోన్నతులు, పీఆర్సీ విషయాల్లో చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకునే వారే కాదని అన్నారు. కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని పీఆర్సీ ఇచ్చి వారిని ఉద్యోగులుగా గుర్తించినట్టు చెప్పారు. గతంలో పదోన్నతులు, పీఆర్సీల కోసం సూట్కేసులు పట్టుకొని దళారులు సచివాలయం చుట్టూ తిరిగేవారని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మామిళ్ల రాజేందర్, టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, ఎమ్మెల్సీ వీజీగౌడ్, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.