సూర్యాపేట, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ): ఆధ్యాత్మిక ట్రెండ్ సృష్టికర్త సీఎం కేసీఆర్ అని త్రిదండి చినజీయర్స్వామి కొనియాడా రు. గతంలో చాలామంది పాలకులు కనీసం మాట్లాడని, చూడని అంశాలను పరిగణనలోకి తీసుకొని పాలన కొనసాగిస్తున్నారని సీఎం కేసీఆర్ను పొగిడారు. ప్రతి ఒక్కరిలోనూ తాను, తన ప్రాంతం, తన చుట్టుపక్కల వారు, తన సమాజం అనే స్వార్థం పెరుగాలని, అలాంటి స్వార్థాన్ని పెంచేది దేవాలయాలేనని ఆయన పేర్కొన్నారు. అందుకే పాలనలోని ప్రతి విషయంలో సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, దైవభక్తిని భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు. గతంలో దేవాలయాలు, భక్తి, ఆధ్యాత్మికత అనే అంశాలను ఉచ్ఛరించడానికే ఇష్టపడని వారు ఉండ గా.. నేడు కోట్లాది రూపాయలు వెచ్చించి యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. సూర్యాపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులకు సో మవారం వేదమంత్రాల నడుమ మంత్రి జగదీశ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపిక, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డితో కలిసి చినజీయర్స్వామి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఆధ్యాత్మికత ఒక భాగమేనని, అందుకే తెలంగాణ త్వరగా పురోగతి సాధిస్తున్నదన్నారు. సమాజాభివృద్ధ్దిలో భగవత్ భక్తి అవశ్యమని, వెయ్యేండ్ల క్రితమే రామానుజాచార్యుల కృషితో ఆధ్యాత్మికత విస్తరణ జరిగిందని గుర్తుచేశారు. ఆలోచనల్లో మార్పు రావాలంటే దానికి కేంద్రం ఆలయాలు అవుతాయని, దీనిని సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు. గతంలో ప్రభుత్వాలు చొరవ చూపని అంశాలను సైతం కేసీఆర్ పట్టించుకుంటూ పూర్తి చేస్తున్నారని, అభివృద్ధిలో అడుగడుగునా దైవనామాలు తీసుకొస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ఆధ్యాత్మికతకు జొప్పిస్తుండటం గొప్ప విషయమన్నారు. సూర్యాపేటలో అతి పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని రూ. 12 కోట్లతో పునర్నిర్మించడం అభినందనీయమన్నారు.