హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూల్ టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2 వేల నగదు, 25 కిలోల బియ్యం పంపిణీ కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతున్నది. శనివారం 2,562 దరఖాస్తులు రాగా.. ఆదివారం వీటి సంఖ్య 45,025కు చేరుకున్నది. 10 వేల వరకు దరఖాస్తులను విద్యాశాఖ అధికారులు మండలస్థాయిలో పరిశీలించారు. సవ్యంగా ఉన్నవాటిని ఆమోదం కోసం జిల్లాస్థాయికి పంపిస్తున్నారు. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చారు. ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను మండలస్థాయి పరిశీలనలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్లవారీగా చేపడుతున్నారు. వచ్చిన దరఖాస్తులు, సమర్పించిన ఆధారాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సెలవురోజుల్లోనూ బృందాలు పనిచేస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లాలో 115 పాఠశాలల్లో 1,260 దరఖాస్తులు అప్లోడ్ చేయగా.. 54 బృందాలు 500 వరకు దరఖాస్తులను పరిశీలించాయి. మంచిర్యాల జిల్లాలో 36 బృందాలను ఏర్పాటుచేయగా.. 50 పాఠశాలల నుంచి వచ్చిన 150 వరకు దరఖాస్తులను పరిశీలన పూర్తిచేశాయి.