హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీర్లతో ఇరిగేషన్ ఉన్నతాధికారులు బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించినట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం ఇప్పటికే జస్టిస్ పీసీ ఘోష్ను నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర అధికారులు ఇటీవల కలకత్తా వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఆయనకు అందజేయగా.. త్వరలో రాష్ర్టానికి రానున్నట్టు జస్టిస్ ఘోష్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ ఉన్నతాధికారులు తాజాగా ప్రత్యేక సమీక్ష నిర్వహించి, వివిధ విభాగాల అధికారులతో సమాలోచనలు చేసినట్లు సమాచారం.