Gurukula Teachers | హైదరాబాద్, ఏప్రిల్11 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించడంతోపాటు, వారి కదలికలను పర్యవేక్షించేందుకు టీచర్లకు నైట్డ్యూటీలు వేస్తూ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురుకుల ప్రిన్సిపాళ్లు, ఆర్సీవోలకు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం రెండుగా ఉన్న నైట్డ్యూటీ టీచర్ల సంఖ్యను నాలుగుకు పెంచాలని, రెగ్యులర్ టీచర్లు అందుబాటులో లేకుంటే పార్ట్ టైం టీచర్లను వినియోగించుకోవాలని సూచించారు.
ప్రిన్సిపాళ్లు కచ్చితంగా గురుకులంలోనే ఉండాలని ఆదేశించారు. నైట్డ్యూటీ టీచర్లు హాస్టళ్లలోనే ఉండి, రాత్రంతా మేల్కొని విద్యార్థుల కదలికలను గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు. గురుకుల ప్రిన్సిపాళ్లు ఆయా జిల్లాల చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ల సాయం తీసుకోవాలని, క్రిటికల్ ఇష్యూస్ ఉంటే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని, రీజినల్ కోఆర్డినేటర్లు గురుకులాలను నిరంతరం పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సొసైటీ పరిధిలోని గురుకులాల్లో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులకు రాత్రి విధులు సర్వసాధారణమే. రోజుకు ఇద్దరు చొప్పున విధుల్లో ఉంటారు. రాత్రి 9.30 గంటలకు, తెల్లవారుజామున 4.30 గంటలకు మరోసారి స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. వీరు రాత్రంతా హాస్టళ్లలోనే ఉండాలన్న ఆదేశాలు ఇప్పటి వరకు లేవు. తాజాగా, సొసైటీ కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వుల్లో నైట్డ్యూటీ ఉపాధ్యాయుల పనివేళలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేవు. ఎప్పుడు రావాలి? ఎప్పుడు వెళ్లాలి అనేదానిపై స్పష్టత లేదు.
సొసైటీ కార్యదర్శి జారీచేసిన ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. టీచర్లతో నైట్వాచ్మన్ ఉ ద్యోగం చేయించడం తగదని మండిపడుతున్నారు. రాత్రంతా మేల్కొని విధులు నిర్వర్తిస్తే ఉదయం మళ్లీ విధులు ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇది తమ ఆరోగ్యంపైనా ప్రభావం చూపిస్తుందని ఆవేదన చెందుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు శాస్త్రీయ కారణాలు విశ్లేషించకుండా ఉపాధ్యాయులకు నైట్డ్యూటీ వేయడం ఎంతమాత్రమూ తగదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇప్పటికే బోధనేతర కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నామని, వీటికి ఇప్పుడు నైట్డ్యూటీ చేర్చడం ఎంతమాత్రమూ సరికాదని, ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉపాధ్యాయులకు నైట్ స్టే డ్యూటీల కేటాయింపుపై జారీచేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం (టీఎస్డబ్ల్యూఆర్టీఈఏ)అధ్యక్షుడు బాలరాజు, ప్రధాన కార్యదర్శి దయాకర్ డిమాండ్ చేస్తూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు శాస్త్రీయ కారణాలు తెలుసుకోకుండా టీచర్లను నైట్వాచ్మన్లుగా మార్చడం తగదని, ఇది ఉపాధ్యాయ వృత్తిని అవమానించడమే అవుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పరోక్షంగా ఉపాధ్యాయులను వేధించడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. వారి సేవలను విద్యాబోధనకు మాత్రమే పరిమితం చేయాలని, నైట్డ్యూటీలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు.
నైట్డ్యూటీ ఉత్తర్వులపై ఉపాధ్యాయులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో సీతాలక్ష్మి స్పందించారు. సొసైటీ ప్రిన్సిపాల్స్ వాట్సాప్ గ్రూప్లో సందేశం పంపించారు. తమ ఉద్దేశాలను ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకోవద్దని, పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా చూడాలనే ఉద్దేశంతోనే అలా చేయాల్సి వచ్చిందని వివరించారు. అనుకోని ఘటనలు జరిగితే తొలుత ప్రధానోపాధ్యాయులే బాధ్యులు అవుతారని, అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉపాధ్యాయులు ఒకరికొకరు సాయం చేసుకుంటూ విద్యార్థులకు అండగా ఉంటారని, అందరి శ్రేయస్సు కోసమే ఆ ఉత్తర్వులు జారీచేసినట్టు వివరించారు. నైట్డ్యూటీకి సంబంధించి ఉపాధ్యాయులకు సీసీఎల్ కూడా అందిస్తామని తెలిపారు. గురుకుల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సెక్రటరీ జారీచేసిన సర్క్యులర్పై కొందరు ఉపాధ్యాయులు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని ముథోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహ్మద్ రఫీయొద్దీన్ ఒక ప్రకటనలో ఆగ్రహం చేశారు.