హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. గురువారంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యం లో వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 2 నుంచి ఒక్కో పంచాయతీకి ఒకరిని, లేదా ఒకటికన్నా ఎక్కువ పంచాయతీలను ఓ గ్రూప్గా చేసి వాటిపై ఒక అధికారిని నియమించాలని బుధవారం సాయంత్రం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
తాసీల్దార్/ఎంపీడీవో/వ్యవసాయ అధికారి/ఎండీవో/ఎంపీవో తదితర అధికారులు, లేక వీరికి సమానస్థాయి అధికారి, లేక అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని సూచించింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని స్పష్టంచేసింది. తదుపరి ఎన్నికలు నిర్వహించేవరకు తమ పదవీకాలాన్ని పొడిగించాలని కొద్దిరోజులుగా సర్పంచ్లు కోరుతున్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకే మొగ్గుచూపింది. గ్రామ పంచాయతీల్లో సింహభాగం బీఆర్ఎస్కు చెందిన సర్పంచ్లు ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక అధికారుల నియామకానికే మొగ్గుచూపినట్టు తెలుస్తున్నది.
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్లది కీలక పాత్ర: కేటీఆర్
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర ఎనలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. గురువారంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా వారి సేవలను ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో నర్సరీలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు నెలకొల్పడం ద్వారా తెలంగాణ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో సర్పంచ్ల పాత్ర కీలకమన్నారు. పదవికి మాత్రమే విరమణ తప్ప ప్రజాసేవకు కాదని, సర్పంచ్లు మరింత కాలం ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షించారు.