Dharani | హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహించిన ‘ప్రత్యేక డ్రైవ్’ సగంలోనే ఆగిపోయింది. తొమ్మిది రోజుల్లో 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ శనివారంతో ముగుస్తున్నది.
అయితే నిర్దేశించిన గడువులో లక్ష్యానికి సగందూరంలోనే ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ధరణిలో వివిధ మాడ్యూళ్ల కింద మొత్తం 2,46,536 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. వీటి పరిషారానికి ఈ నెల 1వ తేదీ నుంచి తాసిల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు చెప్పింది. గురువారం నాటికి 91వేల దరఖాస్తుల పరిష్కారం పూర్తయ్యిందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
శనివారం సాయంత్రానికి సుమారు 1.25 లక్షల మేర దరఖాస్తులు డిస్పోజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే లక్ష్యానికి సగం దూరంలోనే స్పెషల్ డ్రైవ్ ఆగిపోనున్నట్టు చెప్పుకుంటున్నారు. 2.45 లక్షల దరఖాస్తులను 9 రోజుల్లో పరిష్కరించాలంటే రోజుకు సగటున దాదాపు 28వేల దరఖాస్తులను పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో సగటున రోజుకు 15వేల దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
సగం తుది దశలో ఉన్నవే?
స్పెషల్ డ్రైవ్లో పరిష్కరించిన దరఖాస్తుల్లో అత్యధికం గతంలోనే తుదిదశకు చేరి ఆగిపోయినవి ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికల నాటికి అనేక దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యి, నివేదికలు వివిధ దశల్లో ఉన్నట్టు చెప్తున్నారు. కొన్ని కలెక్టర్, మరికొన్ని సీసీఎల్ఏ వద్ద పెండింగ్లో ఉన్నట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరిగింది. దీంతో దరఖాస్తుల డిస్పోజ్ ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా స్పెషల్ డ్రైవ్ పేరుతో ఈ దరఖాస్తులకు తుది అనుమతులు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. శుక్రవారం నాటికి డిస్పోజ్ అయిన దరఖాస్తుల్లో దాదాపు సగం ఇలాంటివేనని సమాచారం.