హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్పెషల్ డ్రైవ్’ ఉత్తుత్తి డ్రామా అని తేలిపోయింది. రెవెన్యూ శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం విఫలమై లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చేసిన ఎన్నికల స్టంట్గా తేలిపోయింది. గడువు ముగిసినా ఎన్ని దరఖాస్తులు పరిష్కారమయ్యాయో చెప్పుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉన్నదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ధరణి పోర్టల్లో మొత్తం 16 మాడ్యూళ్ల కింద 2.45 లక్షల పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని, వాటిని 9 రోజుల్లో పరిష్కరిస్తామంటూ ప్రభుత్వం ఈ నెల ఒకటి నుంచి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. మండల స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు కమిటీలు వేసి, వాటికి మార్గదర్శకాలు విడుదల చేసి హడావుడి చేసేసింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు శనివారంతో ముగిసింది. కానీ లక్ష్యంలో కనీసం సగం కూడా పూర్తి కాలేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
గతంలో కొలిక్కి వచ్చినవాటికే మోక్షం?
ధరణిలో సుమారు 1.10 లక్షల పెండింగ్ దరఖాస్తులు పరిష్కారమైనట్టు సమాచారం. అయితే ఈ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొలిక్కి వచ్చినవేనని చెప్తున్నారు. గతంలో కలెక్టర్లు క్షేత్రస్థాయి నుంచి నివేదిక తెప్పించుకొని వాటి ఆధారంగా పరిష్కరించేవారు. ఈ క్రమంలో నిరుడు సెప్టెంబర్ నాటికే అనేక దరఖాస్తులు కొలిక్కి వచ్చాయని, కలెక్టర్లు, సీసీఎల్ఏలో తుది అనుమతుల వద్ద ఆగిపోయాయని, ఈలోగా అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయినట్టు చెప్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటికి మోక్షం కలుగుతుందని భావించినా, ధరణిలో రిజిస్ట్రేషన్లు మినహా మిగతా లావాదేవీలన్నీ నిలిపివేయాలన్న మౌఖిక ఆదేశాలతో అవన్నీ పెండింగ్లో పడిపోయాయి. వీటినే ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పేరుతో పరిష్కరించినట్టు చెప్పుకోవాలని చూస్తున్నదనే చర్చ జరుగుతున్నది. వీటిలో పెండింగ్ మ్యుటేషన్లు, కోర్టు కేసుల అంశాలు, ఖాతా మెర్జింగ్ వంటి సులభమైనవే ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు.
స్పెషల్ డ్రైవ్ ముగిసిందా? పొడిగించారా?
ధరణి దరఖాస్తుల స్పెషల్ డ్రైవ్ను ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ఏ వరకు కమిటీలు వేసి, వాటికి బాధ్యతలు అప్పగించి, నిర్దిష్ట గడువు విధించింది. ప్రకటనల వరకు బాగానే ఉన్నా.. పనిలోకి వచ్చేసరికి తొలిరోజు నుంచే మౌనం పాటిస్తున్నది. ఎన్ని బృందాలు ఏర్పాటు చేశారు? వారికి శిక్షణ ఎలా ఇచ్చారు? దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారు? వంటి వాటినే ప్రభుత్వం చెప్పుకోలేకపోయింది. మధ్యలో ఓసారి రెవెన్యూ శాఖ మంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రెస్నోట్ను విడుదల చేశారు. అందులో ఎన్ని దరఖాస్తులు డిస్పోజ్ చేశారో మాత్రమే చెప్పారు. ఆ తర్వాత శనివారం నాటికి గడువు పూర్తయినా, నిర్దేశించిన సమయంలో ఎన్ని పూర్తయ్యాయో చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. స్పెషల్ డ్రైవ్ ముగిసిందా? దానిని పొడిగిస్తున్నారా? అసలు ఏ స్థితిలో ఉన్నదో అన్న విషయాలు కనీసం అధికారులకు కూడా తెలియకపోవడం గమనార్హం.