హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం చేపట్టిన మంచిపనిలో భాగస్వామ్యం అయ్యేందుకు విపక్షాలు ముందుకొచ్చాయి. సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన తెలంగాణ హరితనిధికి బేషజాలు లేకుండా జైకొట్టాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన హరితనిధికి అందరూ సహకరించాలని కోరారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతినెలా వారి జీతాల నుంచి రూ.500 చొప్పున హరితనిధికి జమచేస్తామని సభలో సీఎం కేసీఆర్ ప్రకటించగానే ఒకరి తరువాత ఒకరు విపక్ష పార్టీల నేతలు లేచి హరితనిధి అద్భుతమైన ఆలోచన అని, దానిలో భాగస్వామ్యం అవుతామని వెల్లడించారు.
పర్యావరణ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. సీఎం కేసీఆర్ ప్రతిపాదించిన హరితనిధిలో మేము కూడా భాగస్వాములం అవుతాం. మా పార్టీ శాసనసభ్యులు నెలకు రూ.500 హరితనిధికి జమచేస్తారు. ఎంపీలతో కూడా మాట్లాడి ఒప్పిస్తాం. మంచిపనిలో పాలుపంచుకోవటంకన్నా ఆనందం మరొకటి ఉండదు.
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
సీఎం ప్రతిపాదించిన గ్రీన్ఫండ్కు సంపూర్ణ మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రవ్యాప్తంగా 3.67% అటవీ విస్తీర్ణం పెరగడం సంతోషకరం.
– ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ
సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో గ్రీన్ ఫండ్కు రూపకల్పన చేశారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయటం గొప్ప విషయం. గ్రీన్ఫండ్కు తప్పకుండా తమ జీతాల నుంచి నెలకు రూ.500 ఇస్తాం. డబ్బులు ఎంత ఇస్తున్నాం అన్నది కాదు.. అందులో నేను ఉన్నాను అనే గొప్ప స్ఫూర్తిని సీఎం కేసీఆర్ ఇచ్చారు. ఆయన దార్శనికత గొప్పది. భవిష్యత్తు తరాలకు సీఎం కేసీఆర్ వారధి కడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ హరిత విస్తరణకు దృష్టి సారించాలి.
– బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
హరితనిధి ఏర్పాటును స్వాగతిస్తున్నాం. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని మరింత సమర్దంగా నిర్వహించేందుకు హరితనిధిని ఏర్పాటుచేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం హర్షణీయం. హరితనిధిలో మేమూ భాగస్వాములమవుతాం. హరితహారంలో ఉద్యోగులను భాగస్వాములను చేసినట్టుగానే, హరితనిధిలో పాలుపంచుకొనే అవకాశం కల్పించడంతో మా బాధ్యత మరింత
పెరిగింది.
-టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్