హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ):ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యాశాఖ కృషి చేస్తున్నది. ఎస్సెస్సీ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించే విషయంలో డీఈవోలకే అధికారాలు ఇచ్చారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు, రివిజన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి పర్యవేక్షిస్తున్నారు. స్పెషల్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు దాతల సహకారంతో స్నాక్స్, టిఫిన్లు అందజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది పది పరీక్షల్లో 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లే నిర్వహిస్తుండటంతో అందుకు తగ్గట్టుగా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. తామే స్వయంగా మాడల్ పేపర్లు రూపొందించి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయిస్తున్నారు.
విద్యార్థులు ఉత్సాహంగా వస్తున్నారు
జనగామ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు నవంబర్ 15 నుంచి స్పెషల్ క్లాసులు ప్రారంభించాం. ఇవి ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఉత్సాహంగా వస్తున్నారు. ఎంఈవోలు, ఇతర అధికారులు స్కూళ్లను సందర్శించి, సూచనలు చేస్తున్నారు. రోజుకోక టీచర్ విధులకు హాజరయ్యేలా చూస్తున్నాం. – రాము, జనగామ డీఈవో
రోజుకు రెండు గంటలు రివిజన్
మా స్కూళ్లో 65 మంది టెన్త్ విద్యార్థులున్నారు. వీరిలో 12 మంది తెలుగు, 53 మంది ఇంగ్లిష్ మీడియం చదువుతున్నారు. ఉదయం 8:45 గంటల నుంచి 9:45 వరకు, సాయంత్రం 4:05 నుంచి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం.
– నందికొండ విద్యాసాగర్, గణితం టీచర్, జెడ్పీహెచ్ఎస్, చల్లూరు, కరీంనగర్ జిల్లా