హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు విహారయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీలను తీసుకురానున్నట్టు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. పోచంపాడు, పొచ్చెర, కుంటాల జలపాతాలకు ప్రత్యేక సర్వీసులను ప్రారంభించినట్టు చెప్పారు. ఎంజీబీఎస్, జేబీఎస్, నిజామాబాద్, నిర్మల్ నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. విహార యాత్రలు చేసేవారు ఈ సేవలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్యాకేజీలు ఇలా..
పోచంపాడు, పొచ్చెర, కుంటాల జలపాతాలకు ప్రత్యేకబస్సులు ఎంజీబీఎస్ నుంచి ఉదయం 5 గంటలకు, జేబీఎస్ నుంచి ఉద యం 5.30 గంటలకు బయలుదేరుతాయి. పెద్దలకు రూ.1,099, పిల్లలకు రూ.599 టికెట్ ధర నిర్ణయించారు. నిజామాబాద్ నుంచి కుంటాల జలపాతానికి ప్రత్యేక బస్సులు ప్రతి ఆదివారం ఉదయం 8:00 గంటలకు బయలుదేరుతాయి. సాయంత్రం 5:00 గంటలకు ఈ బస్సు తిరిగి నిజామాబాద్ చేరుకుంటుంది. పెద్దలకు రూ.420, పిల్లలకు రూ.200 టికెట్ ధరలు నిర్ణయించారు. నిర్మల్ బస్టాండ్ నుంచి కుంటాల జలపాతం వరకు నిత్యం బస్సులు నడుస్తాయి. పెద్దలకు రూ.200, పిల్లలకు రూ.110 టికెట్ ధర నిర్ణయించారు. టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ www.tsrtconline.in లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
గరుడ ప్లస్ చార్జీలు 10 శాతం తగ్గింపు
హైదరాబాద్ నుంచి విజయవాడ- బెంగళూరు వెళ్లే గరుడ ప్లస్ బస్సు సర్వీసుల్లో టికెట్ చార్జీలను టీఎస్ఆర్టీసీ 10 శాతం తగ్గించింది. శుక్ర, ఆదివారాలు మినహా ఈ నెల 30వ తేదీ వరకు ఈ రాయితీ వర్తిస్తుంది.