హైదరాబాద్ : వసంత పంచమి సందర్భంగా ఈనెల 26న రాష్ట్రంలోని పలు జిల్లాల పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. మొత్తం 108 బస్సులను ప్రత్యేకంగా కేటాయించింది, నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు 88, సిద్దిపేట జిల్లాలోని వర్గల్కు 20 బస్సులను నడుపుతున్నామని వెల్లడించింది. బుధ, గురువారాల్లో ఈ బస్సులు ఆయా డిపోల నుంచి నడుస్తాయని తెలిపారు.
బాసరకు హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి 21, జేబీఎస్ నుంచి 12, నిజామాబాద్ నుంచి 45, హన్మకొండ నుంచి 5, కరీంనగర్ నుంచి 4, జగిత్యాల నుంచి ఒక బస్సును ఏర్పాటు చేసినట్లు వివరించారు. వర్గల్కు సికింద్రాబాద్(గురుద్వారా) నుంచి ప్రతి అరగంటకో బస్సు నడుస్తాయని పేర్కొన్నారు. సికింద్రాబాద్ గురుద్వారా నుంచి 10, జేబీఎస్ నుంచి 6, గజ్వేల్ నుంచి 2, సిద్దిపేట నుంచి 2 బస్సులను నడుపుతున్నామని తెలిపారు.
వసంత పంచమి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బాసర, వర్గల్కు 108 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. భక్తుల రద్దీ మేరకు అదనపు సర్వీసులను సంస్థ పెంచుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేక బస్సు సర్వీస్ లను ఉపయోగించుకోవాలని భక్తులకు సూచించారు. ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించాలని కోరారు.