Minister Koppula | హజ్యాత్రకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్ హజ్ కమిటీ భవనంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హజ్యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఎయిర్ పోర్టు, రవాణా, పోలీసులు, జీహెచ్ఎంసీ, రోడ్లు భవనాల శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని వసతులు సమకూర్చినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. హజ్హౌస్లో అవసరమైన సౌకర్యాలను పూర్తి చేసిన్టలు మంత్రి వివరించారు. హైదరాబాద్ నుంచి వివిద శాఖల సహకారంతో ప్రత్యేక విమాన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యాత్రికుల వసతి, బస, విమానాల టికెట్ బుకింగ్, బోర్డింగ్ సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ హజ్హౌస్లో పాసులు, సామాను స్క్రీనింగ్, సామగ్రి చెక్ఇన్, మెడికల్, టీకా వంటివి ఏర్పాటు చేశారని చెప్పారు.
శంషాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక టెర్మినల్ సౌకర్యం ఏర్పాటు చేశారన్నారు. యాత్రికుల కోసం డయాస్, సిట్టింగ్ ఏర్పాట్లు, బస్ పాయింట్లు దిగడం, సామాగ్రి స్ర్కీనింగ్, చెక్ ఇన్ కౌంటర్లు, మొదలైనవి హజ్హౌస్లో ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దాదాపు 7వేల మంది హైదరాబాద్ నుంచి హజ్యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. జూన్ 5 నుంచి నుంచి హజ్ చార్టర్ విమానాలు నడుపుతారని, యాత్రికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యాత్రికుల కోసం విస్తారా ఎయిర్లైన్స్ హజ్హౌస్కు రిపోర్ట్ చేస్తారని తెలిపారు. ఆన్లైన్ ఈ-బుకింగ్ సిస్టమ్, మాన్యువల్ బుకింగ్ సిస్టమ్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసిఉల్లాఖాన్, మైనార్టీ కార్పోరేషన్ ఉన్నతాధికారి షఫీ ఉల్లాఖాన్, వివిధశాఖ అధికారులు పాల్గొన్నారు.