హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో టిఆర్ఎస్ బలం ముందు బీజేపీ బలం ఎంత? మేమే గనక దాడులకు దిగితే బీజేపీ నేతలు బయట తిరగలేరు’ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపైకి బీజేపీ కార్యకర్తలు ఆందోళనల పేరిట దాడికి రావడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని అన్నారు. ఇటీవల బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి వచ్చిన నేపథ్యంలో.. గురువారం ఆమె నివాసానికి పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి వెళ్లి మంత్రి సంఘీభావం తెలిపారు. కవితకు సంఘీభావం తెలిపిన వారిలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు సంతోష్ కుమార్, బీబీ పాటిల్, వద్దిరాజు రవిచంద్ర, విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్రెడ్డి, దండె విఠల్, రాజేశ్వర్రావు, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, బేతి సుభాష్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి దామోదర్గుప్తా, వై సతీష్రెడ్డి, పది జిల్లాల డీసీసీబీ చైర్మన్లు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలో లికర్ పాలసీపై బీజేపీ నేతలు ఎమ్మెల్సీ కవితపై నిరాధారంగా ఆరోపణలు చేయడం, ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు నిరసన పేరుతో ఆమె ఇంటిపైకి దాడికి రావడం ఒక సెచ్ ప్రకారమే జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా ప్రశ్నిస్తున్నందునే.. బీజేపీ కవితను లక్ష్యంగా చేసుకున్నారని ప్రశాంత్రెడ్డి విమర్శించారు. సీబీఐ, ఈడీలను తమ జేబు సంస్థలుగా బీజేపీ వాడుకుంటున్నదని మంత్రి మండిపడ్డారు. ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేస్తున్నారని.. అందుకు సీబీఐ, ఈడీలను వాడుకుంటున్న విధానం ప్రజలంతా చూస్తున్నారని ధ్వజమెత్తారు. 2004 నుంచి 2014 వరకు దేశం లో 150 ఈడీ సోదాలు జరిగితే.. 2014 నుంచి ఇప్పటివరకు 8 ఏండ్లలో 20 వేలకు పైగా తనిఖీలు జరిగాయన్నారు. అందులో 5వేల మంది బీజేపీలో చేరగానే వారి కేసులు మాఫీ అయ్యాయని, వాషింగ్ పౌడర్తో ఉతికినట్టు స్వచ్ఛంగా మారిపోయారని ఎద్దేవా చేశారు.
నిర్ణయాధికారం సభాపతిదే
ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యవహరంలో శాసనసభ నిబంధనావళిని స్పీకర్ పరిశీలిస్తారని, చట్ట ప్రకారమే సభాపతి వ్యవహరిస్తారని మంత్రి ప్రశాంత్రెడ్డి వెల్లడించారు. రాజాసింగ్ అనుచిత వ్యాఖ్యలపై ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేసిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా మంత్రి సమాధానమిచ్చారు.
ఎమ్మెల్సీ కవితకు ఎంపీ వద్దిరాజు సంఘీభావం
హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఆమె నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. బీజేపీ అల్లరి మూకలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండి ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కవితను కలిసి సంఘీభావం తెలిపిన వారిలో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, మున్నూరు కాపు సంఘం అపెక్స్ కమిటీ కన్వీనర్ పుట్టం పురుషోత్తం తదితరులు ఉన్నారు.