బాన్సువాడ (కామారెడ్డి ) : ‘ప్రకృతి విపత్తును తప్పించలేం. కానీ తప్పించుకోవచ్చు.రైతులకు చేతులెత్తి దండం పెడుతున్నా. పంట కాలాన్ని ముందుకు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాన’ ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) రైతాంగానికి విన్నవించారు.బాన్సువాడ గ్రామీణ మండలం తాడ్కోల్, కొయ్యగుట్ట, మొగలాన్ పల్లి లలో కురిసిన అకాల వర్షం, వడగండ్ల తో నష్టపోయిన పంటలను(Crop Damage Visit) బుధవారం ఆయన పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులను ఓదార్చారు.
పోచారం మాట్లాడుతూ .. ‘ రాష్ట్రంలో ప్రతి ఏడాది నవంబర్లో తుఫాన్లు, ఏప్రిల్ నెలలో వడగండ్లు కురుస్తాయి.అందుకే యాసంగి వరి మడులను నవంబర్ లో పోసుకుని ముందస్తుగా నాట్లు వేసుకుంటే మార్చి నెలలో కోతలు పూర్తయి పంట చేతికొస్తుంది. వడగండ్లు తప్పించవచ్చని సూచించారు. వానాకాలం(Rain Season) కోసం రోహిణి కార్తెలోనే నార్లు పోసుకుని నాట్లు వేసుకుంటే అక్టోబర్ నెలలో కోతలు పూర్తయి నవంబర్ నెలలో సంభవించే తుఫాన్ల ముప్పు తప్పించుకోవచ్చన్నారు.
రైతులు కోరితే రోహిణి కార్తె లోనే నార్లు పోసుకోవడానికి నిజాంసాగర్ ప్రాజెక్టు(Nizamsagar ) నుంచి నీటిని విడుదల చేపిస్తానని వెల్లడించారు. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నేలపాలవడం బాధాకరమని పేర్కొన్నారు. రెవెన్యూ(Revenue), వ్యవసాయ శాఖ(Agricultural)లు వెంటనే సంయుక్తంగా సర్వే చేసి పంట నష్టంపై ప్రాథమిక అంచనాల వివరాలను ప్రభుత్వానికి పంపించాలని అధికారులను ఆదేశించారు.
నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడానికి ప్రయత్నిస్తానని అన్నారు.రైతులు మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలని, కళ్లాలు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటాలు అయిన ధాన్యాన్ని వెంటనే రైసు మిల్లులకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి అంజిరెడ్డి, RDO రాజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యవసాయ, రెవిన్యూ శాఖ అధికారులు, రైతులు స్పీకర్ పోచారం గారి వెంట ఉన్నారు.