వికారాబాద్, డిసెంబర్ 27 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన(Prajapalana) కార్యక్రమాన్ని పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Prasad Kumar) అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమంపై శాసనసభ సభాపతి వికారాబాద్(Vikarabad) నియోజకవర్గస్థాయి అధికారులకు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వారం రోజుల పాటు కొనసాగే ప్రజా పాలన కార్యక్రమాన్ని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులలో ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలలో 5 పథకాలైన మహా లక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ వారం రోజుల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు.
ప్రజా పాలనకు దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా, సున్నితంగా వ్యవహరిస్తూ దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా అధికారులు పనిచేయాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, లింగ్యా నాయక్, ఆర్డీవో విజయ కుమారి, డీఎస్పీ నర్సింలు, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, తదితరులు పాల్గొన్నారు.