బాన్సువాడ రూరల్, నవంబర్ 11 : తెలంగాణ గురుకుల విద్యా విధానం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం మై నార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ విద్యా దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కేవలం ఐదు మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉండేవని, రాష్ట్రం సాధించాక 206కు చేరుకున్నాయన్నారు. విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 206 గురుకుల పాఠశాలలో 1.30 లక్షల మంది పేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 206 మైనార్టీ గురుకులాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశామన్నారు.