కోటగిరి, ఆగస్టు 25 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన 28 పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. ‘బాన్సువాడ నియోజక వర్గంలోని ప్రజలకు అడిగినవన్నీ ఇచ్చా.. మరోసారి నన్ను ఆశీర్వదించండి’ అని వేడుకున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద నియోజకవర్గంలో 11 వేల ఇండ్లు ఇచ్చినట్టు తెలిపారు.
త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. దేశంలో ఎక్కడా రైతుబీమా పథకం లేదని అన్నారు. నియోజకవర్గంలో పేదల కోసం అన్ని కుల సంఘాల విన్నపం మేరకు 100 ఫంక్షన్ హాళ్లు మంజూరు చేసినట్టు చెప్పారు. వీటిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పక్క రాష్ర్టాల్లో రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేడని, దీంతో వారు తెలంగాణకు వచ్చి పంటను అమ్ముకుంటున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.