బాన్సువాడ, ఏప్రిల్ 24: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, రాష్ర్టానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెంచి ప్రధాని పేదల కడుపుకొట్టి తన దోస్తు అదానీకి పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ దోస్తులకు సద్ది కడుతున్నారని ఆరోపించారు. కేంద్రంపై ఎవరైనా మాట్లాడితే ఈడీతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసంలో స్పీకర్ పోచారం సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని ఎంత అడ్డుకోవాలని చూసినా ఇక్కడ సీఎం కేసీఆర్ ఉన్నారని, ఎవరికీ భయపడరని స్పష్టం చేశారు. చేతనైతే తెలంగాణకు మంచి చేయండి కానీ కాళ్లల్లో కట్టెలు పెట్టే పని చేయొద్దని కేంద్రానికి సూచించారు. రాష్ర్టానికి వాటా ప్రకారం రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని స్పీకర్ విమర్శించారు.
దేశంలో 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని స్పీకర్ పోచారం దుయ్యబట్టారు. గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ.. ఇలా ఏవీ ఇవ్వలేదని స్పీకర్ విమర్శించారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ అధికారంలో ఉన్న 19 రాష్ర్టాల్లో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 4 రాష్ర్టాల్లో ఎందుకు లేవని స్పీకర్ ప్రశ్నించారు. ఒకవేళ ఉన్నట్టు చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకొంటామని సవాల్ విసిరారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో తమ వాటా ఉన్నదని చెప్తున్న బీజేపీ నాయకులు.. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు ఇండ్లు నిర్మించడం లేదని నిలదీశారు.
మోదీ ప్రజలను కొట్టి తన దోస్తులకు పంచి పెడుతున్నాడని స్పీకర్ ఆరోపించారు. ప్రధాని నాయకత్వం అదానీ కోసమే కానీ ప్రజల కోసం కాదని విమర్శించారు. ఎవరి తాత సొమ్మని కార్పొరేట్ మిత్రులకు చెందిన రూ.12.50 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని ప్రశ్నించారు. కేంద్రం తీరుపై ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఈడీ, బేడీలతో దాడులు చేయించడం అలవాటైందని మండిపడ్డారు. ఈడీలు, బేడీలు రాజకీయ సంస్థలు కావని, అవి రాజ్యాంగ సంస్థలని గుర్తుంచుకోవాలన్నారు.