నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 10: తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు కొనియాడారు. ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆమె విగ్రహాలు, చిత్రపటాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పలు సంఘాల నాయకులు అంజలి ఘటించారు.
ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు సాగాలని పలువురు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ వేల్పూర్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జనగామ జిల్లా పాలకుర్తిలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆమె విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహబూబ్నగర్లోని పద్మావతి కాలనీలో గ్రీన్బెల్ట్లో ఏర్పాటుచేసిన ఐలమ్మ విగ్రహాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. వనపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.