నిజామాబాద్ : బాన్సువాడ పట్టణంలోని బీసీ బాలుర వసతి గృహాన్నిశాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి స్పీకర్ అల్పాహారం తిన్నారు. తనిఖీల్లో భాగంగా ముందుగా భోజనశాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల కోసం ఉదయం వండిన అల్పాహారాన్ని పరిశీలించారు. వంటలో వినియోగించే అన్ని రకాల కూరగాయలు, పప్పులు, దినుసులు సక్రమంగా కలిపి రుచికరంగా వండుతున్నారా అని వంట మనషులను అడిగారు. రుచికరమైన ఆహారాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాలను, సరుకులను పరిశీలించారు. బియ్యం, పప్పులు, ఇతర సరుకులు, దినుసులు, కూరగాయలు ఎప్పటికప్పుడు తాజాగా తెప్పించుకోవాలని స్పీకర్ హాస్టల్ వార్డెన్కు సూచించారు. కల్తీ, డేట్ ముగిసిన, నిల్వ ఉన్న పదార్థాలను కొనుగోలు చేసినా, తెప్పించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పీకర్ హెచ్చరించారు.