హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ కలలను సాకారం చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. శుక్రవారం అంబేదర్ జయంతి సందర్భంగా శాసనసభ ప్రాంగణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళి అర్పించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిలో చీఫ్ విప్ భానుప్రసాదరావు, విప్లు ఎంఎస్ ప్రభాకర్రావు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీలు వాణీదేవి, దయానంద్, విప్ గొంగిడి సునీత, అసెంబ్లీ సెక్రటరీ వీ నర్సింహాచార్యులు తదితరులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ.. మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా భావించే రాజ్యాంగాన్ని రూపొందించిన మహాదార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలను తెలంగాణ ఆచరిస్తున్నదని.. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని చెప్పారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్య్రం సాధించింది మహాత్మాగాంధీ అయితే, పరిపాలన పద్ధతులు, దేశపౌరులు శాంతియుతంగా బతకడానికి అవసరమైన రాజ్యాంగ రచనలో కీలకపాత్ర పోషించిన మహానుభావుడు అంబేడర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్కు రుణపడి ఉన్నదని పేర్కొన్న సీఎం కేసీఆర్.. 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పి అంబేద్కర్కు ఘన నివాళి అర్పించే అరుదైన సన్నివేశం శుక్రవారం ఆవిష్కృతమైందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ పరిపూర్ణం చేస్తున్నదని వివరించారు., దళితబంధు పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ.17,700 కోట్లను ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఏ పార్టీ నాయకులకు లేదని స్పష్టంచేశారు.