కామారెడ్డి : కులవృత్తుల వారు స్వగ్రామంలోనే ఉపాధి పొంది మంచిగా బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణ పరిధిలోని కల్కి చెరువులో ప్రభుత్వ ఉచిత చేప విత్తనాల్నిచెరువులో వదిలారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈరోజు విడుదల చేస్తున్న చేప పిల్ల ధర రూపాయి. సంవత్సరానికి కిలో పెరిగితే వంద రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ఖర్చుతో ఉచితంగా చేప పిల్లలను అందిస్తే మత్స్యకారులకు ఏడాదికి 10,000 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం పెద్ద చేప పిల్లలను మాత్రమే చెరువులో వదలాలి. సైజు తక్కువగా ఉన్న చేప విత్తనాలను తిరస్కరించాలని ఆయన మత్స్యకారులకు సూచించారు. ప్రతి చెరువు దగ్గరకు నేనే స్వయంగా వచ్చి పరిశీలిస్తాను. చేప పిల్లలు సైజు ప్రకారం ఉంటేనే చెరువులో వేస్తాను. లేదంటే తిరిగి వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు.