బాన్సువాడ, సెప్టెంబర్ 13 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే సీఎం కేసీఆర్ను మించిన నాయకుడు లేడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తరహా మరెక్కడా లేదని, సంక్షేమ పథకాల్లోనూ తెలంగాణే ముందంజలో ఉన్నదని అన్నారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూ.30 లక్షలతో నిర్మించిన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం భవనాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం భవన పరిసరాల్లో టీఎన్జీవోస్ సంఘం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమంతోనే కేంద్రం భయపడి రాష్ర్టాన్ని ప్రకటించిందని తెలిపారు. ప్రభు త్వం సాధించే విజయాల్లో ఉద్యోగుల కృషిని మరువలేమని అన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ పేర్కొన్నారు.