Pocharam Srinivas Reddy | నిజామాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలను తీసుకొచ్చారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండల కేంద్రంలో శనివారం ‘సుపరిపాలన దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పొతంగల్లోరూ. 2 కోట్లతో నూతనంగా నిర్మించనున్న మండల కాంప్లెక్స్ భవన నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం పొతంగల్ సాయిబాబా ఆలయ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు.
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిచడం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తున్నదని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతోనే పని చేస్తే సంక్షేమ పథకాలు అమృతం లాగా ఉంటాయన్నారు. ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేలా పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరిగిందన్నారు. నూతన రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు అయ్యాయన్నారు. 62 మున్సిపాలిటీలు ప్రస్తుతం 142కు పెరిగాయన్నారు. సీఎం కేసీఆర్కు బాన్సువాడ నియోజకవర్గంపైన ప్రత్యేకంగా ప్రేమ ఉండడంతో నిధులు భారీగా వస్తున్నాయన్నారు. బీసీ కుల వృత్తిదారుల కోసం రూ.లక్ష రూపాయల 100 శాతం సబ్సిడీపై రుణ సౌకర్యం అందిస్తున్నామన్నారు. అర్హులైనవారు ఈ నెల 20వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. షెడ్యూల్ ప్రకారం మంజూరైన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవన్నారు. అక్కడి ప్రజలు బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చల్లగా.. నిండు నూరేళ్లు బాగుండాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు.