బాన్సువాడ టౌన్, సెప్టెంబర్ 5 : మంచి పనులతోనే తరతరాల గుర్తింపు వస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తన నివాసం వద్ద బాన్సువాడ పట్టణంతోపాటు, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు రూ.12 కోట్ల బిల్లులను స్పీకర్ అందజేశారు. పోచారం మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి వారి సొంతింటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకాన్ని ప్రవేశ పెట్టినట్టు తెలిపారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మౌలిక సదుపాయాల కల్పనకు బాన్సువాడ నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి బిల్లుల కోసం రూ.400 కోట్లు అవుతుందని, అందులో సుమారు రూ.350 కోట్ల బిల్లులను ఇప్పటివరకు పంపిణీ చేశామని తెలిపారు. ఈ ఒక్క రోజే 1,203 మంది లబ్ధిదారులకు సుమారు రూ.12 కోట్ల బిల్లులను పంపిణీ చేసినట్టు చెప్పారు.