కామారెడ్డి : తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అవిరాళంగా కృషి చేస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి (Speaker Pocharam ) అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో (Independence day) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేసి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
స్పీకర్ మాట్లాడుతూ రైతును ( Farmer ) రాజుగా చేసే ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని, తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని ప్రశంసించారు. భారతదేశం పేదది కాదు, ప్రజలు మాత్రమే పేదవారు. పరిపాలన దక్షతతో సుపరిపాలన గావిస్తే దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం, అనుబంధం రంగాలపై ఆధారపడి ఉన్నారు. దేశ జనాభాకు అవసరమైన ఆహారాన్ని అందిస్తుంది రైతులు. అలాంటి రైతులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
జిల్లాలో 4.84 లక్షల ఎకరాల సాగు భూమి ఉంటే ఈ ఏడాది వానాకాలంలో వంద శాతం పంటలు సాగు చేశారని, రైతుబంధు (Raitu Bandu) పథకం ద్వారా జిల్లాలో గత 11 విడతలలో మొత్తం 2,500 కోట్ల నగదు రైతులకు అందిందని పేర్కొన్నారు. రైతుబీమా ( Raitu Beema) పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 5,895 మంది రైతులు చనిపోతే, ఒక్కొక్కరికి అయిదు లక్షల రూపాయల చొప్పున రూ. 294.75 కోట్లు ఆందించామని వివరించారు. కుల వృత్తుల వారు స్వగ్రామంలో ఉపాధి పొందడానికి ప్రభుత్వం ఆయా పథకాలను అందిస్తుందని, మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ, యాదవులకు సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేస్తుందని తెలిపారు.
వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగులకు, ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ వేడుకల్లో జుక్కల్, ఎల్లారెడ్డి శాసనసభ్యులు హన్మంత్ షిండే, జాజుల సురేందర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, , జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభా రాజు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.