బీర్కూర్, మార్చి 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం సతీసమేతంగా మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా రుత్వికులు, పురోహితులు మృత్యుంజయ మంత్రాన్ని పఠించి, మంత్రోచ్ఛరణలతో యాగాన్ని పూర్తి చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని, ఆయన త్వరగా కోలుకోవాలన్నారు. ఆయనను రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలు సైతం కావాలనుకుంటున్నారని అన్నారు. బంగారు తెలంగాణ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రజలకు అన్నివిధాలా తానై నిలుస్తున్న కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యవంతులై రాష్ర్టానికి, దేశానికి తమ సేవలు అందించాలని ప్రార్థించారు.