నిజామాబాద్ : బాన్సువాడ నియోజకవర్గ(Bansuwada constituency) ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని.. నియోజకవర్గ ప్రజలకే తన జీవితం అంకితమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి(Speaker Pocharam) అన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని బర్ధిపూర్, కల్లూర్, కొడిచెర్ల, పాత పొతంగల్, కొత్త పొతంగల్, హంగర్గా, జల్లాపల్లి ఫారం, జల్లాపల్లి అబాదిలో బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్పీకర్కు గ్రామాల్లో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆశీస్సులతో మీ ముందుకు మరోసారి వచ్చానని తనకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కొందరు నాయకులు టూరిస్టుల్లా వస్తుంటారని వారిని ప్రజలు నమ్మొద్దన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో విడుదల చేశారని తెలిపారు. వేల కోట్లు నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని.. మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. స్పీకర్ ఆధ్వర్యంలో కల్లూర్, పొతంగల్ తదితర గ్రామాల్లో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బర్ధీపూర్, పొతంగల్లో పలు కుల సంఘాల వారు ఏకగ్రీవంగా మద్దతూ తెలుపుతూ పత్రాలు అందజేశారు.