శంకుస్థాపన చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ, జూలై 6: ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు వారంలో 4 రోజులు పవర్ హాలీడే ఉండేదని.. ప్రస్తుతం కోతలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నాయని తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ శివారులోని కొయ్యగుట్ట వద్ద 14.26 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఆటోనగర్కు బుధవారం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ నర్సింహారెడ్డి, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డితో కలిసి స్పీకర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. 4 వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 6 ఆటోనగర్లు ఉండేవని, స్వరాష్ట్రంలో కొత్తగా 3 ఆటోనగర్లు మంజూరైనట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది భూములు ఉన్న రైతులు, మరో 30 లక్షల మంది చేతి కష్టంపై ఆధారపడి జీవించే వారున్నారన్నారు. అలాంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.