బాన్సువాడ : పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో కనకదుర్గాదేవి ఆలయ నిర్మాణానికి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే టీచర్స్ కాలనీలో బ్రాహ్మణ సంఘం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పురపాలక మంత్రి కేటీఆర్ మరో రూ.14కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
కల్కి చెరువు వద్ద పెద్దలకు, మహిళలకు రెండు పార్కులు, పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్కులను రూ.4కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ వాసులు ఇంటితో పాటు రోడ్లను, మురికి కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పేదలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు జరుపుకునేందుకు నియోజకవర్గంలో రూ.50 కోట్లతో 80 ఫంక్షన్ హాల్స్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఇవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కల్యాణ వేదికలని, ఈ ఫంక్షన్ హాల్స్లో కేవలం నామమాత్రపు రుసుం తీసుకుంటారన్నారు. ప్రభుత్వ నిధులతో 70 ఎకరాల భూమిని సేకరించి సొంత స్థలం లేని 2వేల మంది పేదలకు స్థలాలను అందించి అభివృద్ధి చేసిందే సంగమేశ్వర కాలనీ అని తెలిపారు. అందరికన్నా ముందే నిద్ర లేచి సమాజాన్ని మేల్కొపే వారే బ్రాహ్మణులని, ఎంత ఖర్చు చేసి దేవాలయాలు నిర్మించినా పూజలు చేసే బ్రాహ్మణులు లేకపోతే దానికి విలువ లేదన్నారు.
బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది పేదలేనని, బ్రాహ్మణుల వద్ద లక్ష్మీ లేకపోయినా సరస్వతి ఉంటుందన్నారు. తాడ్కోల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూం సముదాయంలో ఇండ్లు లేని పేద బ్రాహ్మణుల కోసం ఇండ్లను కేటాయించామన్నారు. ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.