నిజామాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సోమవారం చందూరు మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..2014 కు ముందు కేవలం 800 కోట్ల రూపాయల పెన్షన్లు ఇచ్చేవారు. నేడు 12000 కోట్ల రూపాయల ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్లు రెండు వేల రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఏడాదికి రెండు పంటలకు రూ. 15 వేల కోట్లు రైతు బంధు ద్వారా అందజేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతులు అధిక లాభాలను అందించే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఆయిల్ ఫామ్ పంట బాగుంది. మొక్కలను సబ్సిడీపై అందిస్తామని స్పీకర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.