చందూర్, మే8: వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో అన్నదాతకు స్వర్ణయుగం వచ్చిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పైప్లైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు నీళ్లు, కరెంటు అందిస్తే బంగారు పంటలు పండిస్తారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని స్పీకర్ పేర్కొన్నారు. మల్లన్నసాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరుతుండటంతో నిజాంసాగర్ 365 రోజులు నిండుకుండను తలపిస్తున్నదని చెప్పారు. జాకోరా, చందూర్, చింతకుంట ఎత్తిపోతల పథకంతో 10 వేల ఎకరాలకు నీరు అందుతుందని వివరించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.