బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా నిధులు, పథకాలు ఇస్తారని ఆశపడ్డానని, కానీ, ఆమె అన్నీ అబద్ధాలే మాట్లాడారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాను స్పీకర్ హోదాలో మాట్లాడడం లేదని, నియోజకవర్గ శాసనసభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా మాట్లాడుతున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తనకు అక్క లాంటి వారన్నారు. ఆమెతో తనకు రాజకీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. గతంలో తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్లి కోల్డ్ స్టోరేజీల మంజూరు కోసం వారిని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా.. ఒక్కటి కూడా మంజూరు చేయలేదని చెప్పారు.
తాను పశుసంవర్థక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని యాదవుల కోసం గొర్రెల పంపిణీ పథకం మొదలైందని స్పీకర్ పోచారం తెలిపారు. ఇందులో 25 శాతం లబ్ధిదారుడు, 75 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేలా పథకం ప్రారంభించినట్టు చెప్పారు. అప్పుడు సీఎం అనుమతితో ఢిల్లీ వెళ్లి ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకువచ్చామని, దీనికి కేంద్రం నిధులతో ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ పథకానికి కేంద్రమే నిధులిస్తోందని నిర్మలాసీతారామన్ అబద్ధం చెప్పారన్నారు. చేపల పంపిణీకి కూడా కేంద్రం నిధులిస్తోందని నిర్మలాసీతారామన్ అబద్ధాలు వల్లె వేశారని చెప్పారు. అప్పటి మత్స్య శాఖ మంత్రిగా ఉన్న తాను సీఎంకు విజ్ఞప్తి చేయగా.. వంద శాతం సబ్సిడీతో ఉచిత చేప విత్తన పంపిణీ ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ పథకానికి కూడా ఎన్సీడీసీ రుణం ఇచ్చిందని వెల్లడించారు.
రైతు ఆత్మహత్యలపై అబద్ధాలు..
రైతు ఆత్మహత్యలపై కూడా నిర్మలా సీతారామన్ తప్పుగా మాట్లాడారని స్పీకర్ పోచారం మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. దేశంలో అతి తక్కువగా రైతుల ఆత్మహత్యలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని పేర్కొన్నారు. ఫసల్ బీమా పథకంలో లోపాలు ఉండడంతో రైతులే కోర్టుకు వెళ్లి అమలుచేయ వద్దంటూ ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.25,000 కోట్ల నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని, కానీ, కేంద్ర సర్కారు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జాతీయ హోదా ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. డబుల్ బెడ్ రూం పథకం కేంద్రానిదే అని నిర్మలా సీతారామన్ చెబుతున్నారు.. అలాంటప్పుడు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో ఈ పథకం ఎందుకు లేదని పోచారం ప్రశ్నించారు. సబ్సిడీ బియ్యంలో కూడా సగం కేంద్రానిది, సగం రాష్ట్రానిది అని, సబ్సిడీ బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం రూ.3,600 కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. ఇకనైనా హుందాగా వ్యవహరించాలని, పార్టీలతో సంబంధం లేకుండా అందరం కలిసి రాష్ట్రం, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కోరారు.